ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత నందమూరి బాలకృష్ణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి సన్మానించారు. శాలువాతో సత్కరించిన కిషన్ రెడ్డి, పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందనలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. సినిమాల ద్వారా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఆయన, ఎన్టీఆర్ వారసుడిగా సేవలందిస్తూ ప్రజల మన్ననలను అందుకున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ అవార్డు లభించడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ “బాలకృష్ణ గారు ఒక వర్సటైల్ నటుడిగా తన ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన సేవలు ఎంతోమందికి ప్రేరణ. ఈ అవార్డు ద్వారా ఆయన ప్రతిభకు న్యాయం జరిగినట్టు అనిపిస్తోంది,” అని చెప్పారు. బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్శన సందర్భంగా కిషన్ రెడ్డి, బాలకృష్ణ మధ్య కాసేపు స్నేహపూర్వకంగా చర్చలు జరిగాయి. సాంస్కృతిక, రాజకీయ అంశాలపై ఇరువురూ మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కూడా సమావేశమయ్యారు. బాలకృష్ణను కేంద్రమంత్రివర్గంలో నుంచి వచ్చిన అభినందనలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.