ప్యోంగ్యాంగ్ : ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అమెరికాకు హెచ్చరికలు చేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియా- అమెరికా సైనిక విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో నిత్యం ఉద్రిక్త వాతావరణమే ఉంటుంది. ద.కొరియా-యూఎస్ సైనిక విన్యాసాలను తమపై దాడికి సన్నాహంగా కిమ్ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ చర్య ఘర్షణాత్మక ఉన్మాదానికి ప్రతీక
ద.కొరియాలోని బుసాన్ పోర్ట్లో తాజాగా అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించారు. ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉ.కొరియాపై రాజకీయంగా, సైనికంగా రెచ్చగొట్టే చర్యలను ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ (బైడెన్ ప్రభుత్వం) శత్రుత్వ వైఖరినే ఇది ముందుకు తీసుకెళ్తోంది అని జోంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చర్య ఘర్షణాత్మక ఉన్మాదానికి ప్రతీక అని, దీటుగా ప్రతిస్పందిస్తామని స్పష్టంచేశారు.
కవ్వించేవారిపై చర్యలు
ఆదివారం ఈ విమాన వాహక నౌక బుసాన్ తీరానికి రాగా.. గతనెల ఈ రేవులో అమెరికా అణ్వాయుధ జలాంతర్గామిని నిలిపింది. దీనిని ఉ.కొరియా తీవ్రంగా ఖండించింది. ఘర్షణ కోసం అమెరికా బలమైన ఉన్మాదానికి ఇది అద్దం పడుతోంది. వాషింగ్టన్ ప్రమాదకర కవ్వింపు చర్యలతో మేము ఆందోళన చెందుతున్నాం. ఇది కొరియా ద్వీపకల్పం చుట్టుపక్కల తీవ్రమైన సైనిక ఘర్షణకు దారితీయొచ్చు. కవ్వించేవారిపై చర్యలు తీసుకొనే మా చట్టబద్ధమైన హక్కును కచ్చితంగా వాడుకొంటాము అని ఉత్తర కొరియా రక్షణశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. అమెరికా గుడ్డిగా తన బలాన్ని నమ్ముకొంటోందని వ్యాఖ్యానించింది.