Eatala Rajendar: బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఎప్పుడూ ఉంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు పార్టీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. మా పార్టీలో అధ్యక్షులు పదేళ్లు, ఇరవై ఏళ్లు వారసత్వంగా ఉండరు.. అని ఈటల హాట్ కామెంట్స్ చేశారు. మా ఢిల్లీ నాయకత్వం అంతా సమగ్రమైన ఆలోచనతో ప్రణాళికతో ఉన్నారని అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ లో జెండా పండుగ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 70% రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పారు.

బీజేపీ మాత్రమే నిజమైన పార్టీ
గత పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటు సాధించి సగం ఎంపీ సీట్లు గెలుచుకుని రేపటి ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రజలు మెసేజ్ అందించారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని చూసినం వారి పరిపాలన అనుభవమైందని, మళ్లీ ఓటు వేసే ప్రసక్తి లేదని ప్రజలు అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో విఫలమైందన్నారు. కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పథంలో నడపాలంటే బీజేపీ మాత్రమే నిజమైన పార్టీ అని ప్రజల్లో భావన ఉంది కాబట్టి.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది బీజేపీ పార్టీనే అని జోస్యం చెప్పారు.
వక్ఫ్ బిల్లు ద్వారా భూసమస్యలకు పరిష్కారం
బీజేపీ సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసే పార్టీ అని అనేక మంది పార్టీ మేలు కోరేవారు, మద్దతు తెలిపే సంఘాలు ఉంటాయి. మన పార్టీలో ఎవరు పోటీచేసినా వ్యక్తులతో సంబంధం లేకుండా గెలుపు కోసం ప్రయత్నం చేస్తారన్నారు. వక్ఫ్ బిల్లు ద్వారా అనేక మంది 30-40 ఏళ్లుగా పడుతున్న భూసమస్యలకు పరిష్కారం దక్కనుందని చెప్పారు. పడుతున్న బాధలకు పరిష్కారం ఇవ్వనుంది. 14 దేవాలయం మీద దాడి జరిగితే అందులో మన దగ్గర ఉన్న ముత్యాలమ్మ గుడి కూడా ఉంది.