KCR : కేసీఆర్కు దొంగనోట్లు ప్రింటింగ్ ప్రెస్ ఉంది : బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపే వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బీదర్లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందంటూ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఈ నకిలీ నోట్లను విస్తృతంగా ఉపయోగించారని, భారీగా వ్యాపారం చేసి ఓట్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగించారని సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.తెలంగాణలో బీఆర్ఎస్ పాలన సమయంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయిందని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాయని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణపై ఆరు లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పుల భారం ప్రజలపై పడతుందని పేర్కొన్నారు.హామీలు ఇచ్చినప్పుడు ఈ అప్పులు గుర్తుకురాలేదా” అని సీఎం రేవంత్ను ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు భూములు అమ్మాలని చూస్తున్నారని సంజయ్ ఆరోపించారు.

బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి బదులు అప్పులే పెరిగాయని విమర్శించారు.బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిపై వస్తున్న ఊహాగానాలకు బండి సంజయ్ తెరదించారు. తాను ఆ పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. “ఇచ్చినా నేను ఆహ్వానించను. అధ్యక్షుడిగా నేను నిరూపించుకున్నా” అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.అయితే, కొంతమంది తమను బీజేపీ అధ్యక్షులుగా ప్రచారం చేసుకుంటున్నారని, ఈ విధంగా అనుచిత ప్రచారం చేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని హెచ్చరించారు.
కార్యకర్తలను గందరగోళానికి గురిచేయొద్దని, పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గౌరవించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తాను కేంద్ర సహాయ మంత్రి బాధ్యతల్లో ఉన్నానని, అందువల్ల పదవుల విషయంలో ఎటువంటి ఆసక్తి లేదని తెలిపారు.బండి సంజయ్ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కేసీఆర్పై నకిలీ నోట్ల ఆరోపణలు, అప్పుల వ్యవహారం, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై క్లారిటీ – ఇవన్నీ రానున్న రోజుల్లో మరింత చర్చనీయాంశమయ్యే అవకాశముంది. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తిన సంజయ్, భవిష్యత్ రాజకీయాలకు ఏ విధంగా ముందుకు సాగుతారో చూడాలి.