తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. “6500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం” అంటూ సీఎం అసత్య ప్రచారం చేస్తున్నారని, కాగ్ నివేదిక ప్రకారం వాస్తవంగా ఎప్పుడూ 2600 కోట్లకు మించని వడ్డీ మాత్రమే చెల్లించామని ఆమె వెల్లడించారు. రాష్ట్ర ఆదాయంపై కూడా తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, నెలకు 12 వేల కోట్ల ఆదాయం వస్తేనే గొప్ప, కానీ 18 వేల కోట్లు వస్తున్నట్లు చెప్పడం అసత్యమని ఆరోపించారు.

తెలంగాణ అభివృద్ధిని దెబ్బతీసే కుట్రలు
హైడ్రా విధ్వంసం వల్లే రాష్ట్ర ఆదాయం తగ్గిందని కవిత అన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా భారీ ఆదాయం వస్తుందని ప్రభుత్వ అంచనా వేసినా, హైడ్రా వల్ల అది 5800 కోట్లకు తగ్గిపోయిందని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, అభివృద్ధిని వెనక్కి నెట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై కూడా సీఎం అసత్య ప్రచారం చేస్తున్నారని, టన్నెల్ తవ్వకాలకు కేసీఆర్ ఖర్చు చేసిన మొత్తాన్ని ఇతర పార్టీల పాలనలో జరిగిన ఖర్చుతో పోల్చి చెప్పుతూ “కేవలం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 3890 కోట్లు ఖర్చు చేసింది, కానీ గత 30 ఏళ్లలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పెట్టిన మొత్తం 3340 కోట్లు మాత్రమే” అని కవిత వివరించారు.
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు దెబ్బతిన్నా, ప్రజలు ప్రాణాలు కోల్పోయినా సీఎం పట్టించుకోలేదని, అంతకుముందే ఉత్తరాఖండ్లో టన్నెల్ ప్రమాదం జరిగినప్పుడు అక్కడి సీఎం కార్మికులు క్షేమంగా బయటపడే వరకు అక్కడే ఉన్నారని కవిత ఉదాహరణగా చెప్పారు. తెలంగాణలో సుంకిశాల ప్రాజెక్టు, పెద్దవాగు ప్రాజెక్టు కూలిపోతే స్పందించని ప్రభుత్వం, కాంట్రాక్టర్ల పనుల గురించి మాట్లాడకూడదన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యమా? కాంట్రాక్టర్లు ముఖ్యమా?” అని ఆమె ప్రశ్నించారు. “ప్రధానిని కలిసిన వెంటనే బీఆర్ఎస్ పనిగతమని చెప్పిన రేవంత్, ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై కుట్రలు పన్నడమే స్పష్టమవుతోంది” అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.