హైరదాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కవిత మండిపడ్డారు. ఉద్యమ నేత, ప్రజా నాయకుడు, గౌరవనీయులు అయిన కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆక్షేపణీయం అని కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మానవత్వంలేని ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలని కవిత హితవు పలికారు. ఇటువంటి దుశ్చర్యను తెలంగాణ సమాజం గమనిస్తోందని, సమయం వచ్చినప్పుడు మీకు ఇంతకింత శాస్తి జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మర్యాదకు ఉన్న అన్ని హద్దులు దాటేశాడు
ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను కూడా కవిత పంచుకున్నారు. స్టేచర్ ఉందని విర్రవీగితే మిమ్మల్ని స్ట్రెచర్ మీదికి చేర్చారు… మీరు ఇంకా మార్చుకోకపోతే మార్చురీకి పోతారు అంటూ రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించారు. మర్యాదకు ఉన్న అన్ని హద్దులు దాటేశాడు. వెంటనే సీఎం కుటుంబ సభ్యులు ఆయనను మెంటల్ హాస్పిటల్కు తీసుకువెళ్లాలి. లేదంటే తీవ్ర ఆందోళనలో ఉన్న ఆయన తన చుట్టుపక్కల ఉన్నవారిని కరవడం ఖాయం. ‘గెట్ వెల్సూన్.. చీప్ మినిస్టర్’అని కేటీఆర్ అన్నారు.
సీఎం రేవంత్ నిజాన్ని నమ్ముకోలేదు
మరోవైపు ఈ వ్యాఖ్యలపై హరీశ్రావు మాట్లాడుతూ.. పొలిటికల్ మెచ్యూరిటీ లేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘మార్చురీ’ వ్యాఖ్యలు చేశారు. పాలన చేతకాక ఆయన ‘పరనింద’నే పనిగా పెట్టుకున్నారు. గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్రెడ్డి గారడీ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నేతలు ప్రజల పక్షాన పోరాడుతుంటే వాళ్ల మరణాన్ని కోరుకుంటున్న నీచబుద్ధి గల నాయకుడు రేవంత్. సీఎం రేవంత్ నిజాన్ని నమ్ముకోలేదు, నిందలనే నమ్ముకున్నాడు. కష్టాన్ని నమ్ముకోలేదు, కుతంత్రాలనే నమ్ముకున్నాడు. ఇకనైనా తాను ఉన్నది సీఎం కుర్చీలో అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అని హరీశ్రావు అన్నారు.