Karnataka : కర్ణాటక అసెంబ్లీని హనీ ట్రాప్ వ్యవహారం కుదిపేసింది. కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్లో చిక్కుకున్నట్టు కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న గురువారం రాష్ట్ర అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమస్య ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయాన్ని నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ నేతలు లేవనెత్తారు. హనీట్రాప్ వ్యవహారంపై చర్చకు పట్టుబడ్డారు.

తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు
ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్ల కు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని చెబుతోంది. దీంతో సభ రణరంగంగా మారింది. హనీ ట్రాప్పై విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ.. స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు. తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు ప్రతులను చించి స్పీకర్పై వేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
క్యాటగిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు
ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్ల కు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు కర్ణాటక సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం రూపొందించిన బిల్లుకు గత వారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కర్నాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకురానున్నారు. కేటీపీపీ చట్టంలో క్యాటగిరీ 2బీ కింద రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. క్యాటగిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు ఉంటారన్నారు. క్యాటగిరీ 1 కింద ఎస్సీ, ఎస్టీలు, క్యాటగిరీ 2ఏ కింద వెనుకబడిన తరగతులు వారుంటారు.