మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్రెడ్డి (Kakani Govardhan Reddy) క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో చివరకు పోలీసులకు చిక్కారు. ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న ఆయన, కొన్ని నెలలుగా పరారీలో ఉన్నారు. పోలీసులు ఆయన్ని కేరళలో అరెస్ట్ చేయడంతో కేసులో మళ్లీ చురుకైన దర్యాప్తు మొదలైంది. సోమవారం ఉదయం కాకాణిని నెల్లూరుకు తరలించే అవకాశముంది.
మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిర్యాదు
వైఎస్సార్సీపీ హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలోని ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా టన్నుల కొద్ది క్వార్ట్జ్ తవ్వకాలు నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కాగా, పేలుడు పదార్థాల వినియోగం, గిరిజనులను బెదిరించడం వంటి అంశాలు కూడా కేసులో ఉన్నాయి. కాకాణి హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
లుక్ఔట్ నోటీసులు జారీ
ఇప్పటికే లుక్ఔట్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో, పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో జాల మేపిన తర్వాత, చివరకు కేరళలో ఆయనను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కాకాణిపై వచ్చిన ఆరోపణలు, తదనంతర దర్యాప్తు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Read Also : Miss World: మిస్ వరల్డ్ పోటీలో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన.. వీడియో లీక్