తెలంగాణలో నాలుగు పథకాల అమలుకు ప్రభుత్వం రెడీ అయింది. జనవరి 26న రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయనున్నారు. అయితే ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 20న సభలు ప్రారంభం కాగా.. నేటితో ముగియనున్నాయి. అయితే ఈ గ్రామసభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఓ లిస్టు విడుదల చేయగా.. లిస్టులో పేరు లేదంటూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా.. లిస్టులో పేరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పథకాలు, గ్రామసభల్లో విడుదల చేస్తున్న లిస్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. గ్రామసభ లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వచ్చినట్లు కాదన్నారు. ఆ లిస్టులో ఉన్నది దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు మాత్రమేనని చెప్పారు. ఇంకా ఎవరైనా అప్లయ్ చేసుకోని వారుంటే వారు కూడా అప్లయ్ చేసుకుంటారనే ఉద్దేశ్యంతో లిస్టు విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామ సభలు ఫూర్తయిన తర్వాత.. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అన్ని క్రోడీకరించి.. అర్హులను ఎంపిక చేస్తామని అన్నారు. ప్రస్తుతం గ్రామసభల్లో విడుదల చేసిన లిస్టు సెలెక్టడ్ లిస్టు కాదని అన్నారు. అది కేవలం దరఖాస్తు చేసున్నవారి లిస్టు మాత్రమేనని చెప్పారు. ఎన్ని అఫ్లికేషన్లు వచ్చినా.. చిట్ట చివరి లబ్ధిదారులకు కూడా పథకాలు ఇవ్వలన్నేది తమ ఆలోచన అని అన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారు, కుటుంబాలు వేరు పడిన వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డులు తీసుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు.