Janasena: పిఠాపురం జనసంద్రం: కాసేపట్లో ‘జయకేతనం’ సభ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు వేడుకల వాతావరణం నెలకొంది. ఈ మహాసభ కాసేపట్లో పిఠాపురం మండలంలోని చిత్రాడలో ప్రారంభం కానుంది. ప్రత్యేకత ఏమిటంటే జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి ఆవిర్భావ వేడుక. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, విదేశాల్లో ఉన్న జనసైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పిఠాపురం ప్రాంగణం జనసేన శ్రేణులతో కిక్కిరిసిపోయి, సందడి వాతావరణం నెలకొంది. సభాస్థలి చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు జనసేన జెండాలు, భారీ ఫ్లెక్సీలతో అలంకరించారు. కార్యకర్తల సందడి నినాదాలతో అక్కడి వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. సభలో గందరగోళం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు భారీగా అభిమానులు, కార్యకర్తలు హాజరవుతుండటంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

మొత్తం 1,700 మంది పోలీసులను నియమించారు వీరికి తోడుగా 500 మంది పార్టీ వాలంటీర్లు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. అనుకోని పరిస్థితులకు 14 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. ప్రాంగణంలోని ప్రదేశాల్లో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. జనసేన శ్రేణులకు అసౌకర్యం కలగకుండా ఆరు ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా సభకు వచ్చిన వారికి భోజన వసతి కల్పించేందుకు నాలుగు ప్రధాన ప్రాంతాల్లో అన్నదానం ఏర్పాటు చేశారు. ఎండ తాపాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.
ఆయన ప్రసంగాన్ని ఆస్వాదించేందుకు అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనసేన భవిష్యత్తు కార్యచరణపై పవన్ స్పష్టత ఇవ్వబోతారని, పార్టీ అభివృద్ధి దిశగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలనలో భాగస్వామ్యంగా మారిన జనసేన పార్టీ, తన రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ వేడుకను ఉపయోగించుకోనుంది. అధికారం వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న సభ కావడంతో జనసైనికుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై పవన్ స్పష్టత ఇచ్చే అవకాశముంది.ఈ మహాసభలో ఏయే అంశాలు చర్చకు వస్తాయో, పవన్ కల్యాణ్ ఏమి ప్రకటించబోతారో అన్న ఉత్కంఠతో జనసేన అభిమానులు ఎదురుచూస్తున్నారు.