కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కక్షసాధింపు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కక్షసాధింపు రాజకీయాలు ఏ పార్టీకి లేదా ప్రభుత్వానికి మంచివి కావని, ఆ పద్ధతి తరువాత వున్న పరిపాలనను దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలు ప్రజల సమస్యలపై దృష్టి సారించి, అభివృద్ధి లక్ష్యంగా ఉండాలని సూచించారు.
దివంగత నేతలైన వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య కక్షసాధింపు రాజకీయాలు చేయలేదని గుర్తుచేశారు. వారి పాలనలో ప్రజా ప్రయోజనాలు ముందుండేవని అన్నారు. రాజకీయ యుద్ధం తప్పక జరుగుతుందని ఆయన అన్నారు కానీ, దాన్ని వ్యక్తిగత ప్రతీకారంగా మార్చకూడదని తెలిపారు. తాను రాజకీయాల్లో ఎంతో మంది నుండి అన్యాయం అనుభవించానని, కానీ తాను ఎప్పుడూ వారి పట్ల ప్రతీకారం చూపలేదని అన్నారు. రాజకీయ నాయకులు వ్యక్తిగత హితాన్ని వదిలి ప్రజా సమస్యల పరిష్కారంపై కృషి చేయాలని సూచించారు. కక్ష సాధింపు రాజకీయాల వల్ల ప్రజలు రాజకీయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతారని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలలో డబ్బుల ప్రభావం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా డబ్బులు ముట్టకుండా నిజాయితీగా రాజకీయాలు చేస్తారని నమ్మకం ఉండటం చాలా కష్టమని అన్నారు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలు ప్రజలలో చర్చకు దారి తీసాయి. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో నిజాయితీ, విలువలు చాలా ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలలో కక్షసాధింపును తగ్గించడమే కాకుండా ప్రజలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.