ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో సీఎం జగన్ పర్యటన (Jagan Tour) తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జగన్ కాన్వాయ్ వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, చెప్పుల(Stones, sandals) తో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్కి గాయాలు కాగా, అక్కడే ఉన్న ఓ మహిళ కూడా గాయపడ్డారు. ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ దాడితో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనాస్థలికి వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకున్నారు.
టీడీపీ – వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
పొదిలిలో జరుగుతున్న జగన్ పర్యటనను కేంద్రంగా చేసుకుని టీడీపీ శ్రేణులు అమరావతి మహిళలకు మద్దతుగా నిరసనకు దిగారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడే ఉండడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు దాడికి దిగేందుకు ప్రయత్నించడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో స్థానికంగా పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
పొగాకు రైతుల పరామర్శలో జగన్ విమర్శలు
పర్యటన సందర్భంగా సీఎం జగన్ పొగాకు రైతులను పరామర్శిస్తూ, గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “మన ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. కేంద్రం ఇచ్చే రూ.6,000 కాకుండా అదనంగా మరో రూ.20,000 ఇచ్చాం. కానీ గతేడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతుభరోసా రూ.20,000 ఇవ్వలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఏది?” అంటూ ప్రశ్నించారు. రైతుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. రైతుల సమస్యలు కేంద్రంగా రాజకీయ విమర్శలతో పర్యటన సాగింది.
Read Also : Kaleshwaram Commission : ముగిసిన కేసీఆర్ విచారణ