మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల పట్ల విశ్వాసంతో, రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమాగా ప్రకటించారు. జగన్ 1.0కు భిన్నంగా, 2.0 పాలన మరింత దృఢంగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తలకు మరింత బలంగా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.

జగన్ మాట్లాడుతూ, మూడు సంవత్సరాలు కన్నుమూసి తెరిచినంతలోనే గడిచిపోతాయి. ఆ తర్వాత అఖండ మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరింత గట్టి పట్టుతో అమలు చేసి, పునరావృతంగా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజల నాడిని తెలుసుకోవడంలో తాము ముందున్నామని, టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక తప్పుడు నిర్ణయాలు ప్రజలకు ఎలుగెత్తిచెప్పే బాధ్యత తమదని జగన్ అన్నారు.
జగన్ 2.0 – దృఢమైన నాయకత్వం
తన మొదటి పాలన (జగన్ 1.0)లో కొన్ని వ్యూహాత్మక పొరపాట్లు జరిగాయని ఆయన అంగీకరించారు. అయితే, ఈసారి (జగన్ 2.0) మరింత దృఢంగా, కార్యకర్తలకు మద్దతుగా నిలిచే విధంగా తన శైలిని మారుస్తానని చెప్పారు. ఈ సారి తాను ఒక కొత్త జగన్ను చూడబోతున్నారని, అధికారం తిరిగి వచ్చాక పార్టీ శ్రేణులకు మరింత దగ్గరగా ఉంటానని, వారిని గౌరవిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని, గతంలోలా ఇప్పటికీ అవినీతి, రాజకీయ వ్యూహాలతోనే పనిచేస్తున్నారని జగన్ విమర్శించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఉపఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేయడానికి యత్నించిందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు ప్రజలకు నష్టమేనని, వైసీపీని అణిచివేయడానికి కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు.
P4 విధానంపై విమర్శలు
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేయదలచుకున్న P4 విధానం ప్రజలకు మేలు చేసే విధంగా లేదని జగన్ విమర్శించారు. ఈ విధానాన్ని ఉపయోగించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక దీనిపై పూర్తి స్థాయిలో సమీక్ష చేసి, ప్రజలకు న్యాయం చేయడం ఖాయమని చెప్పారు. అప్పుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, అసలు ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వంటి నినాదాలు ఉపయోగిస్తున్నారని జగన్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పార్టీ కార్యకర్తలను వేధించేందుకు ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు. ప్రజా సేవలో ఉండాల్సిన అధికారులను రాజకీయం చేయడం ద్వారా, ప్రజాస్వామ్య విలువలను నీరుగార్చే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలు చూపించిన ధైర్యానికి, త్యాగానికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన కార్యకర్తలను ఎవరూ అణచలేరు. మీరు చూపిన విశ్వాసం, పట్టుదలతో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. 2029 వరకూ టీడీపీ ఉండదని, ప్రజలు త్వరలోనే వారి నిజస్వరూపాన్ని అర్థం చేసుకుంటారని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు మరింత కష్టపడాలని, ప్రజా సమస్యలను నేరుగా జనాల్లోకి వెళ్లి తెలియజేయాలని సూచించారు. చివరిగా, జగన్ మాట్లాడుతూ – “వైసీపీకి కష్టకాలం గతంలో ఉంది, కానీ ఇకపై మనదే రాజ్యం” అని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎప్పటికీ ఒకేలా ఉండవని, ప్రజలు మార్పును కోరుకుంటారని, ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి పార్టీ శ్రేణులందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.