న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ కార్యక్రమానికి దరఖాస్తులు కోరుతోంది. శ్రీహరికోటతో పాటు… డెహ్రాదూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ)లోని కేంద్రాల్లో ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. విద్యార్థులు మార్చి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ 7న ప్రకటించనున్నారు. ఎంపికైన విద్యార్థులు సంబంధిత ఇస్రో కేంద్రాల్లో మే 18లోగా చేరాల్సి ఉంటుంది. మే 19 నుంచి 30 వరకు యువికా-25 కార్యక్రమం నిర్వహించనున్నారు. వీరికి ఇస్రో గెస్ట్ హౌజ్ లేదా హాస్టళ్లలో వసతి సౌకర్యాలు ఉంటాయి. రవాణా ఖర్చులు, కోర్స్ మెటీరియల్, వసతి ఖర్చులన్నీ ఇస్రోనే భరిస్తుంది.

దృష్టి మళ్లించటమే ఇస్రో లక్ష్యం
ఈ కార్యక్రమంలో అంతరిక్ష సాంకేతికత, విజ్ఞానం, అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. మే 31న ముగింపు వేడుక నిర్వహిస్తారు. ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు. విద్యార్థి దశలోనే విజ్ఞానం, సాంకేతికత, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ (స్టెమ్) అంశాలపై అవగాహన కల్పించి, తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించటమే ఇస్రో లక్ష్యంగా కొనసాగుతోంది.
ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక
ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్తలు తమ అనుభవాలను పంచుకుంటారు. ల్యాబ్ విజిట్స్ ఉంటాయి. నిపుణులతో చర్చావేదికల్లో పాల్గొనొచ్చు. ఇస్రో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక చేస్తారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం. ఈ ప్రోగ్రామ్కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 080 2217 2269 ఫోన్ నెంబర్లో సంప్రదించొచ్చు.
వీరు అర్హులు..
. 2025 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్నవారు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం, గ్రామీణ విద్యార్థులకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
. ఆన్లైన్ క్విజ్… జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రతిభ చూపితే పది శాతం చొప్పున; క్రీడలు, ఒలింపియాడ్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం చొప్పున ప్రాధాన్యం లభిస్తుంది.
దరఖాస్తు ఇలా..
. యువికా 2025 కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు కొన్ని అవసరమైన స్టె్ప్స్ పాటించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
. ఈమెయిల్ ద్వారా యువికా-2025కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
. ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల్లోపు సూచనలను చదివి ఆన్లైన్ క్విజ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
. క్విజ్ సమర్పించిన తర్వాత, ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను పూర్తి చేసి సమర్పించడానికి యువికా పోర్టల్లోకి లాగిన్ అయ్యే ముందు కనీసం 60 నిమిషాలు వేచి ఉండాల్సి ఉంటుంది. సమర్పించిన ఫారమ్ కాపీని డౌన్లోడ్ చేసుకోవడం మంచిది.
. రిజిస్ట్రేషన్ గడువుకు ముందే ఫారమ్ యొక్క సంతకం చేసిన కాపీని, అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి.