న్యూయార్క్: ఉక్రెయిన్కు సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుంచి తనకు ముఖ్యమైన సందేశం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉక్రెయిన్ శాశ్వత శాంతిని కోరుకుంటోందని, అందుకోసం రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని నివారించడానికి చర్చలకు సిద్ధంగా ఉందని జెలెన్స్కీ తెలిపారన్నారు. ఉక్రెయిన్లు కంటే ఎవరూ శాంతిని ఎక్కువగా కోరుకోరని ఆయన అన్నారన్నారు.

భద్రతా హామీలకు బదులుగా ఖనిజాల ఒప్పందం
దేశంలో శాశ్వత శాంతిని నెలకొల్పడానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేయడానికి నేను, నా బృందం సిద్ధంగా ఉన్నాము. ఉక్రెయిన్ తన సార్వభౌమత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా చేసిన సహాయాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నాం. భద్రతా హామీలకు బదులుగా ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని జెలెన్స్కీ తన సందేశంలో పేర్కొన్నారని ట్రంప్ తెలిపారు. రష్యా సైతం యుద్ధం ముగిసిపోవాలనే కోరుకుంటున్నట్లు ఆ దేశాధ్యక్షుడు పుతిన్ నుంచి కూడా బలమైన శాంతి సంకేతాలు అందాయని అన్నారు.
యూరప్ దేశాలు ఉక్రెయిన్కు ఆర్థిక మద్దతు
ఉక్రెయిన్పై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును డెమోక్రాట్లు వ్యతిరేకిస్తుండడంపై ఆయన మాట్లాడుతూ.. యుద్ధం వల్ల ప్రతి వారం వేలాది మంది రష్యన్లు, ఉక్రెయిన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఇది మరో ఐదేళ్లు కొనసాగాలని మీరు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. యూరప్ దేశాలు ఉక్రెయిన్కు ఆర్థిక మద్దతు ఇవ్వడం కంటే రష్యా నుంచి తీసుకునే చమురు పైనే ఎక్కువ డబ్బు ఖర్చు చేశాయని పేర్కొన్నారు. వాటితో పోల్చితే అమెరికా అత్యధికంగా కీవ్కు వందల బిలియన్ల సహాయం అందించిందని పునరుద్ఘాటించారు.