ఐపీఎల్ 2025: ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (ఐపీఎల్) సీజన్ ఇప్పుడు ఆసక్తికర మలుపుకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ సమీపిస్తున్న ఈ సమయంలో ముంబై ఇండియన్స్ అద్భుతమైన పునరాగమనం చేసి పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. సీజన్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ పరాజయాలతో నలిగిపోయిన జట్టుగా కనిపించినా, వరుస విజయాలతో తిరిగి టాప్ గీర్లోకి వచ్చింది. మొదటి ఐదు మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచిన హార్దిక్ పాండ్యా సేన ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లలో గెలుపొంది “ముంబై ఈజ్ బ్యాక్” అన్న నినాదాన్ని నిజం చేసింది.ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 విజయాలు సాధించింది. 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు కూడా 14 పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ పరంగా వెనకబడటంతో రెండో స్థానానికి పడిపోయింది. ముంబై నెట్ రన్రేట్ 1.274 కాగా, ఆర్సీబీకి అది 0.521గా ఉంది. ముంబై వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. ఈ విజయాలతో ముంబై టాప్ ప్లేస్ లోకి ఎగబాకింది.

ఐపీఎల్ 2025: ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్ను దక్కించుకుంది
మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు పది మ్యాచ్లలో ఆరు గెలిచి, ఒకటి టై చేయడంతో మొత్తం 13 పాయింట్లు సాధించింది. నెట్ రన్రేట్ 0.199గా ఉంది. నాలుగో స్థానంలో గుజరాత్ టైటాన్స్ కొనసాగుతోంది. ఆ జట్టు తొమ్మిది మ్యాచ్లలో 12 పాయింట్లు, 0.748 నెట్ రన్రేట్ తో ఉంది. ఐదో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. వాళ్లు కూడా 12 పాయింట్లతో 0.362 నెట్ రన్రేట్ సాధించారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 10 పాయింట్లతో 0.325 నెట్ రన్రేట్ కలిగి ఆరో స్థానంలో ఉంది.ఇక ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీ తీవ్రంగా సాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్రస్తుత పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్కు చేరడం చాలా కష్టమే. భారీ అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లకు అవకాశాలు లేవు. కేకేఆర్ 9 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుండగా, సన్ రైజర్స్ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.మాజీ ఛాంపియన్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్, ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు, ఈసారి తొలిగా ఎలిమినేట్ అయిన జట్టుగా నిలిచింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి అనంతరం రాజస్థాన్ రాయల్స్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంది. రాజస్థాన్ 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలవగా, సీఎస్కే 4 పాయింట్లతో అట్టడుగున 10వ స్థానంలో ఉంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అద్భుత ఫామ్, ఆర్సీబీ పోటీ, మిగిలిన జట్ల మధ్య సాగుతున్న పోరాటం ఐపీఎల్ 2025 సీజన్ను మరింత ఉత్కంఠభరితంగా మార్చుతోంది.
Read More : IPL 2025: రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఘన విజయం