తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలన కాలంలో రాష్ట్రానికి రూ. 3.5లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తెలిపారు. లండన్లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్–2025 సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక భూమిక పోషించిందని, పెట్టుబడులు రాబట్టడంలో విశేషమైన విజయాలు సాధించామని అన్నారు.
ఉద్యోగావకాశాలు – ఐటీ రంగంలో విస్తరణ
KTR మాట్లాడుతూ, గత పదేళ్లలో తెలంగాణలోని ఐటీ రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందన్నారు. దేశ విదేశాల నుంచి ఐటీ కంపెనీలను ఆకర్షించి దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. హైదరాబాద్ను టెక్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు ఇచ్చాయని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానానికి తీసుకొచ్చామన్నారాయన.
హైదరాబాద్లో MNCల బేస్ – ప్రపంచ స్థాయిలో గుర్తింపు
ప్రపంచ ప్రసిద్ధి పొందిన టాప్ 5 మల్టీనేషనల్ కంపెనీలు (MNCs) తమ అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాయని KTR గుర్తు చేశారు. ఇది తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసానికి నిదర్శనమని, పెట్టుబడులు వచ్చినంత మాత్రాన కాదు, వాటితోపాటు నైపుణ్యాలు, ఉద్యోగాలు, అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చాయని వివరించారు. ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే రాజకీయ స్థిరత, వృద్ధిపట్ల దృక్పథం అవసరమని ఆయన పేర్కొన్నారు.
Read Also : Maria Carolina : ప్రమాదం నుంచి బయటపడిన ఇటలీ యువరాణి