కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న సాయాన్ని ఇప్పటికే ఆ దేశ మంత్రి అంగీకరించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా పలు చర్యల్ని ప్రకటించిన భారత్.. ఇవాళ మరోసారి కీలక చర్యలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ జరిగే సీసీఎస్ భేటీలో ప్రధాని మోడీ ఈ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై పరిమిత సైనిక దాడి చేసేందుకు భారత్ సిద్దమవుతుందా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అదే సమయంలో యుద్ధ నివారణకు ఐక్యరాజ్యసమితి కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు భారత విదేశాంగమంత్రి జై శంకర్ తో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు కూడా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెజ్ కాల్ చేశారు. తాజా పరిస్ధితులపై వీరిద్దరితో చర్చించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.

నిఘా వర్గాల హెచ్చరిక
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెజ్ చేసిన కాల్ లో ఆయన భారత్ తమపై సైనిక దాడికి సిద్దమవుతుందంటూ తెలిపారు. ఈ మేరకు తమపై భారత్ సైనిక దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. దీనిపై ఐరాసను అలర్ట్ చేస్తున్నట్లు పాక్ ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రధాని మోడీ ఇవాళ జరిగే సీసీఎస్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ మొదలైంది.
రాబోయే 24-36 గంటల్లో పాకిస్తాన్పై సైనిక చర్య
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ వైఫల్యం నుండి దృష్టిని మళ్లించేందుకు ఆ దేశ సమాచార , ప్రసారాల సమాఖ్య మంత్రి అతావుల్లా తరార్ ఎక్స్ లో ఓ వీడియో పోస్టు పెట్టారు. ఇందులో పహల్గామ్ సంఘటనలో ప్రమేయం ఉందని నిరాధారమైన , కల్పిత ఆరోపణల సాకుతో భారతదేశం రాబోయే 24-36 గంటల్లో పాకిస్తాన్పై సైనిక చర్య చేపట్టాలని యోచిస్తోందని పాకిస్తాన్కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందన్నారు. దీనిపై తాము తగు విధంగా స్పందిస్తామంటూ సుదీర్ధ పోస్టు పెట్టారు.
Read Also: India Pakistan War: పాక్ విమానాశ్రయాలకూ హైఅలర్ట్ జారీ