అఫ్గానిస్థాన్ – పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరు దేశాల మధ్య భీకర సైనిక దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ వైమానిక దళం ఇటీవల అఫ్గాన్ భూభాగంలో పలు ప్రదేశాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మందికిపైగా తాలిబన్ సైనికులు మరియు పాకిస్థాన్ తాలిబన్ (TTP) ఫైటర్లు మృతి చెందినట్లు పాక్ మీడియా వెల్లడించింది. మరోవైపు, అఫ్గాన్ దళాలు కూడా ప్రతిదాడిగా పాక్ సరిహద్దు ప్రాంతాలపై గోలాలు దాడి జరపగా, కనీసం 8 మంది పాక్ సైనికులు మరణించి, 10 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘర్షణలు ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా నెలకొన్న అవిశ్వాసం, భూవివాదాల కారణంగా మళ్లీ చెలరేగాయి.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2025 Horoscope in Telugu
తాజాగా పాక్ వైమానిక దళం ఫైటర్ జెట్లు, డ్రోన్లను ఉపయోగించి అఫ్గాన్ లోపల దాడులు జరపడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. పాక్ ప్రభుత్వం ప్రకారం, ఈ దాడులు ఉగ్రవాద దళాలపై మాత్రమే జరిపామని, తమ భద్రతను కాపాడుకునే చర్యలే చేశామని స్పష్టం చేసింది. అయితే తాలిబన్ ప్రభుత్వం మాత్రం పాక్ చర్యలను అఫ్గాన్ సార్వభౌమాధికారంపై నేరుగా దాడిగా అభివర్ణించింది. సివిలియన్ ప్రాంతాల్లోనూ బాంబుల వర్షం కురిపించడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వందలాది కుటుంబాలు ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి.

ఇరుదేశాల మధ్య సరిహద్దు అయిన దురాండ్ లైన్ ఇప్పటికే మూసివేయబడింది. వాణిజ్యం, రవాణా పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిణామాలు దక్షిణాసియా భద్రతా పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వాన్ని ఉగ్రవాద గ్రూప్ TTPకు సహకరిస్తోందని పాక్ ఆరోపిస్తుండగా, తాలిబన్ మాత్రం పాక్ తాము ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలను అఫ్గాన్పై మోపే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది. ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పలు దేశాలు ఇరుదేశాలను మితవాదం పాటించమని, సంభాషణల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయమని విజ్ఞప్తి చేశాయి. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూసినట్లయితే, అఫ్గాన్–పాక్ ఘర్షణలు మరింత ముదురే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/