Nicolas Maduro : అమెరికా ప్రత్యేక దళాలు వెనెజువెలా రాజధాని కారకాస్ నుంచి అపహరించిన అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా న్యాయస్థానంలో తొలిసారి హాజరయ్యారు. న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో సోమవారం జరిగిన విచారణలో తాను నిర్దోషినని, గౌరవనీయమైన వ్యక్తినని, తనను అపహరించారని మదురో వ్యాఖ్యానించారు. అమెరికా దాడి తర్వాత ఆయన చేసిన తొలి బహిరంగ వ్యాఖ్యలివి.
అమెరికా ఆరోపిస్తున్న “నార్కో-టెర్రరిజం” కేసులకు సంబంధించి మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్తో కలిసి కోర్టు ముందు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు) యుఎస్ జిల్లా న్యాయమూర్తి అల్విన్ కే. హెలర్స్టీన్ ఎదుట విచారణ జరిగింది. ఇది సుదీర్ఘ న్యాయపోరాటానికి ఆరంభంగా భావిస్తున్నారు.
నీలిరంగు జైలు దుస్తులు ధరించి, చేతులకు (Nicolas Maduro ) బేడీలు వేసిన స్థితిలో భారీ భద్రత మధ్య మదురో, ఆయన భార్యను కోర్టులోకి తీసుకువచ్చారు. ఇంగ్లిష్లో జరిగిన విచారణను స్పానిష్లో వినేందుకు హెడ్సెట్లు ధరించారు. ఈ సందర్భంగా మదురో నేరాన్ని అంగీకరించకుండా, “నేను అపహరించబడ్డాను. నేను నిర్దోషిని. నా దేశానికి అధ్యక్షుడిని” అని న్యాయమూర్తికి తెలిపారు.
కోర్టు వెలుపల అమెరికా చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని, ఆ చర్యలకు మద్దతిచ్చిన కొందరిని పోలీసులు వేరు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమెరికా ఆరోపణల ప్రకారం, మదురో కుటుంబం డ్రగ్ కార్టెల్లతో కలిసి వేల టన్నుల కొకైన్ అక్రమ రవాణాకు సహకరించిందని పేర్కొంది. ఈ కేసులో దోషిగా తేలితే మదురోకు జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
మదురో తరఫు న్యాయవాది బ్యారీ జే. పొలాక్ మాట్లాడుతూ, మదురో సార్వభౌమ దేశాధ్యక్షుడిగా చట్టపరమైన రక్షణ హక్కు కలిగి ఉన్నారని, ఆయన అపహరణ చట్టవిరుద్ధమని వాదించనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై పెద్దఎత్తున ముందస్తు దరఖాస్తులు దాఖలు చేస్తామని పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో యుఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ అమెరికా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. సార్వభౌమ దేశంపై బలప్రయోగం ఐక్యరాజ్యసమితి చార్టర్కు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
వెనెజువెలా ఐక్యరాజ్యసమితి రాయబారి సమ్యూల్ మోన్కాడా మాట్లాడుతూ, అమెరికా దాడులు పౌర మౌలిక సదుపాయాల నష్టం, ప్రాణ నష్టం, అధ్యక్షుడి అపహరణకు దారితీశాయని ఆరోపించారు. అధికారంలో ఉన్న దేశాధ్యక్షుడిని బంధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన హెచ్చరించారు.
రష్యా, చైనా వంటి వెనెజువెలా మిత్రదేశాలు ఈ అపహరణను తీవ్రంగా ఖండించగా, ఫ్రాన్స్, కొలంబియా వంటి అమెరికా మిత్రదేశాలు కూడా అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే యుఎన్లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ మాత్రం ఇది చట్ట అమలు చర్యగా సమర్థించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: