అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య వైట్ హౌస్లో కీలక భేటీ జరిగింది. ఆ సమావేశం చాలా సానుకూల వాతావరణంలో జరిగిందని ట్రంప్ వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ అంశంపై చర్చలు కొనసాగించాలని తాను నెతన్యాహూను కోరినట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ (Trump)తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఆ విషయాలను వెల్లడించారు. “మా సమావేశం చాలా మంచిగా జరిగింది. ఇజ్రాయెల్తో మా సంబంధం అత్యంత బలంగా కొనసాగుతోంది. ఇరాన్తో చర్చలు కొనసాగి ఒక ఒప్పందం కుదిరితే మంచిదని నేను స్పష్టం చేశాను. అది సాధ్యం కాకపోతే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి” అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Cyber Crime: కాంబోడియాలోని సైబర్ నేరగాళ్ల డెన్లపై మిలటరీ ఆపరేషన్

ఇరాన్ అణు మౌలిక వసతులపై దాడులు
ఇక గతంలో ఇరాన్తో ఒప్పందం కుదరని సందర్భాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ మాట్లాడారు. “గతసారి ఇరాన్ ఒప్పందాన్ని తిరస్కరించింది. దాంతో మేము మిడ్నైట్ హ్యామర్ ఆపరేషన్ చేపట్టాం. అది వారికి అనుకూలంగా మారలేదు” అని గుర్తుచేశారు. గత ఏడాది జూన్ 21-22 తేదీల్లో అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ అణు మౌలిక వసతులపై దాడులు జరిపింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని కీలక అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించింది. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించి, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘన అని ఆరోపించింది. ఈసారి అయితే ఇరాన్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అణు ఒప్పందం కుదిరితే పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశముందని చెప్పారు. అదేవిధంగా గాజా పరిస్థితులపై కూడా ఇరు నాయకులు విస్తృతంగా చర్చించారు. గాజాలో జరుగుతున్న పరిణామాలు, భద్రతా అంశాలు, మానవతా పరిస్థితులు, ప్రాంతీయ శాంతి వంటి విషయాలు సమావేశంలో ప్రాధాన్యం పొందినట్లు ట్రంప్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: