భారతదేశం స్మార్ట్ఫోన్ (Smart Phones) తయారీ మరియు ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రస్తుతం, భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తి దేశంగా నిలుస్తోంది, మరియు స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో కూడా రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది.ముఖ్యంగా దేశంలో పీఎల్ఐ స్కీమ్ లాంచ్ చేశాక తయారీ రంగం వేగంగా వృద్ధి సాధిస్తుంది. దీంతో ఎగుమతులు (exports)కూడా భారీగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్స్ ఎగుమతులు దేశంలో ఆకర్షణీయ వృద్ధిని సాధించాయి.

2024–25 ఆర్థిక సంవత్సరంలో, భారత్ స్మార్ట్ఫోన్లను రూ. 2 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేసింది, ఇది గత ఏడాది కంటే 54% అధికం. ఈ ఎగుమతుల్లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఉన్నాయి, ఇవి ప్రధానంగా తమిళనాడులోని ఫాక్స్కాన్ సౌకర్యం ద్వారా తయారు చేయబడుతున్నాయి
భారతదేశంలో మొబైల్ హ్యాండ్సెట్ తయారీలో 99% పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,90,366 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 9,52,000 కోట్లకు పెరిగింది . భారతదేశం 5G స్మార్ట్ఫోన్ మార్కెట్లో 13% వాటాతో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది, చైనా 32% వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఈ విభాగంలో యాపిల్ మరియు శాంసంగ్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
సాంప్రదాయ ఎగుమతులను అధిగమించి
ఇటీవల విడుదలైన డేటా ప్రకారం దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి సాంప్రదాయ ఎగుమతులను అధిగమించి భారతదేశ స్మార్ట్ఫోన్ ఎగుమతులు గత మూడేళ్లల్లో బాగా పెరిగాయి. అమెరికాకు దాదాపు ఐదు రెట్లు, జపాన్కు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. స్మార్ట్ఫోన్ ఎగుమతులు 2023-24లో 15.57 బిలియన్ల డాలర్లు, 2022-23లో 10.96 బిలియన్ల డాలర్ల నుంచి 2024-25లో 24.14 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసిన మొదటి ఐదు దేశాలు అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్గా ఉన్నాయి. అమెరికాకు భారతదేశం ఎగుమతులు 2022-23లో 2.16 బిలియన్ల డాలర్ల నుంచి 2023-24లో 5.57 బిలియన్ల డాలర్లకు, 2024-25లో 10.6 బిలియన్ల డాలర్లకు పెరిగాయి.
ఈ వేగవంతమైన పెరుగుదల వల్ల స్మార్ట్ఫోన్లు భారతదేశంలో అత్యధికంగా ఎగుమతి చేసిన వస్తువుల్లో ఒకటిగా మారిందని. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి ఎగుమతులను అధిగమించడానికి దోహదపడిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.
ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం వంటి ప్రభుత్వ పథకాల వల్ల వృద్ధి వేగంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ సర్వీస్ నివేదిక ప్రకారం 2024లో భారతదేశ స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో ఆపిల్, సామ్సంగ్ దాదాపు 94 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2024లో మేడ్-ఇన్- ఇండియా స్మార్ట్ఫోన్ ఎగుమతులు సంవత్సరానికి 6 శాతం పెరిగాయి. 2025లో భారతదేశంలో స్మార్ట్ఫోన్ తయారీ వృద్ధి అంచనా 2025లో రెండంకెలలో పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Also : Gold: దుబాయ్ బంగారంపై భారత్ కఠిన చర్యలు