ఊహించినట్టే- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా తమ దేశంలో నివసిస్తోన్న ఏ ఒక్కడ్నీ వదలట్లేదు. వెంటాడుతున్నారు. చాలామందిని ఇప్పటికే చేతికి బేడీలు వేయించి మరీ వాళ్ల దేశానికి పంపించారాయన. ఇప్పుడు దీన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వివిధ దేశాల పౌరులపై గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. గత ఏడాది ఆగస్టులో ఎన్నికల ప్రచార సమయంలో ఎలాన్ మస్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులను రాడికల్స్గా, టెర్రరిస్టులుగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్.
బుధవారం ఆయన వైట్ హౌస్లో మాట్లాడారు. చోరీలు, హింసాత్మక నేరాలకు పాల్పడే వాళ్లు, ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా తమ దేశంలో నివసిస్తోన్న వారిని నిర్బంధించడానికి అనుమతించే బిల్లుపై సంతకం చేస్తానని పేర్కొన్నారు. గ్వాంటెనామో బే జైలులో 30,000 బెడ్స్ సిద్ధం చేయిస్తానని, అక్కడ వాళ్లకు ఆశ్రయం కల్పిస్తానంటూ చురకలు అంటించారు. ఈ మేరకు పెంటగాన్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాలో అక్రమంగా నివసించే వాళ్లను ఏలియన్లుగా అభివర్ణించారు. 9/11 దాడులకు పాల్పడిన అల్-ఖైదా ఉగ్రవాదులను కూడా గ్వాంటనామో జైలుకు తరలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అలాంటి వాళ్లు అమెరికా గడ్డపై నివసించడానికి ఏ మాత్రం అర్హులు కారనీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి అప్పట్లో. ఇప్పుడు దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా- అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసి పడేశారు. నాన్ అమెరికన్లకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ ఆ దేశ పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలికారు. అదే సమయంలో మెక్సికో సరిహద్దులకు భారీగా దళాలనూ పంపించారు. ఇప్పుడు తాజాగా అక్రమ వలసదారులను గ్వాంటెనామో బే జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించారు.