పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశాన్ని తీవ్రంగా ఉలిక్కిపడేసింది. ఈ దాడికి బదులుగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో కీలక ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రతీకార దాడితో రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. భారత సైన్యం శక్తివంతంగా ఎదురుదాడికి దిగింది. ఇందులో పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి.

పౌరుల ప్రాణాలు ముప్పులో
కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్కు పాల్పడుతున్నాయి. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతుండటంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాక్ దాడులు అధికంగా రెసిడెన్షియల్ ఏరియాలపైనే జరుపుతుండటం వల్ల సరిహద్దు ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
భారత సైనికుడు వీరమరణం
బుధవారం అర్ధరాత్రి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను వీరమరణం పొందినట్లు తెలిసింది. పాక్ షెల్లింగ్లో గాయపడిన 5వ ఫీల్డ్ రెజిమెంట్కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ ధ్రువీకరించింది. గత 14 రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు 12 మంది భారత పౌరులు మృతి చెందగా, 57 మంది గాయపడినట్లు సైన్యం వెల్లడించింది.
Read also: Rakshana Mantri Rajnath : ఆపరేషన్ సిందూర్కు హనుమంతుడే స్ఫూర్తి: రక్షణ మంత్రి రాజ్నాథ్