అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీ సభ నిర్వహించనుంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో లక్ష మందితో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరా మహిళా శక్తి మిషన్-2025’ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాలు, స్వయం సహాయ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు భారీగా హాజరుకానున్నారు.
ఈ మిషన్ ప్రధాన లక్ష్యం
ఈ మిషన్ ప్రధాన లక్ష్యం సెర్చ్, మెప్మా సంస్థలను విలీనం చేసి కోటి మంది మహిళలకు రూ. లక్ష కోట్ల రుణం అందించడం. దీనివల్ల స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరుగుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఈ స్కీమ్ కింద మహిళలకు రుణ సౌకర్యాలు, సబ్సిడీలు, బీమా పథకాలు, వ్యాపారోద్ధరణ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి
ఈ కార్యక్రమంలో మహిళల ఆధ్వర్యంలో నడిచే 150 అద్దె బస్సులను ప్రారంభించనున్నారు. అలాగే 31 జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త పెట్రోల్ బంకులను ప్రారంభించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి సభలో స్పష్టం చేయనున్నట్లు సమాచారం.
మహిళా శక్తి మిషన్ కింద రుణబీమా, ప్రమాద బీమా పథకాలు
ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రుణబీమా, ప్రమాద బీమా పథకాలను కూడా ప్రారంభించనున్నారు. రుణ బీమా కింద ఋణగ్రహీత మహిళలు అకాల మరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా బీమా సొమ్ము అందించనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు మహిళల సాధికారతను పెంచేందుకు మద్దతు ఇస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.