దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు రోజంతా లాభాల్లోనే ట్రేడయ్యాయి. దీంతో వరుసగా మూడు రోజులు నష్టాల్లో ముగిసిన సూచీలకు నేడు బ్రేక్ పడింది. సెన్సెక్స్ (Sensex) ఉదయం 80,777.65 పాయింట్ల (క్రితం ముగింపు 80,737.51) వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. ఓ మోస్తరు శ్రేణిలో కదలాడిన సూచీ ఇంట్రాడేలో 80,705.18- 81,087.29 మధ్య కదలాడింది. ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో రాణించిన సూచీ చివరకు 260 పాయింట్ల లాభంతో 80,998 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 24,644.25 వద్ద గరిష్ఠాన్ని తాకిన నిఫ్టీ (Nifty) చివరకు 77 పాయింట్ల లాభంతో 24,620.20 వద్ద ముగిసింది. ఎటర్నల్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టైటాన్, ఎల్అండ్టీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 65.93 డాలర్ల వద్ద ట్రేడవగా.. బంగారం ఔన్సు 3,387 డాలర్ల వద్ద కొనసాగింది.

నూతన లిస్టింగ్లు – IPO షేర్ల ప్రవేశం
ప్రధాన బోర్డు నుంచి వచ్చిన స్కోడా ట్యూబ్స్ (Scoda Tubes) ఐపీఓకు షేర్లు నేడు స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. ఇష్యూ ధర 140 కాగా ఆ ధర వద్దే షేర్లు లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో 5 శాతం షేర్లు రాణించాయి. మార్కెట్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు 5 శాతం లాభంతో రూ.147 వద్ద ముగిశాయి. ఎస్ఎంఈ విభాగం నుంచి వచ్చిన నెఫ్ట్యూన్ పెట్రోకెమికల్ (Neptune Petrochemicals) షేర్లు నేడు దలాల్ స్ట్రీట్లో లిస్ట్ అయ్యాయి. ఎస్ఎస్ఈలో 9 శాతం ప్రీమియంతో స్టాక్ ఎక్స్చేంజ్లో ఎంట్రీ ఇచ్చాయి. ఇష్యూ ధర రూ.122 కాగా ఎస్ఎస్ఈలో రూ.132.75 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టాయి. ఇంట్రాడేలో రాణించిన షేర్లు మార్కెట్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో 14 శాతం లాభంతో రూ.139 వద్ద ముగిశాయి.
Read Also: Apple Mobile: ఐఫోన్ 15పై భారీ తగ్గింపు!