అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు భారతీయ పార్ట్ టైమర్లకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా స్వదేశం వదిలి మెరుగైన ఉపాధి అవకాశాలు, చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన వీరంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారీగా అమెరికాకు వెళ్లి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై ట్రంప్ ఉరుముతున్నారు. వరుస తనిఖీలతో బెంబేలెత్తిస్తున్నారు. దీంతో వారు ఉద్యోగాలు వదిలేసి పారిపోతున్నారు. అమెరికాలో ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్ నివేదికలో అక్కడ మొత్తం 11.26 లక్షల మంది విదేశీ విద్యార్ధులు ఉండగా.. అందులో భారతీయులే 3.30 లక్షల మంది ఉన్నారు. ప్రతీ పది మందిలో ముగ్గురు మనోళ్లే. అందులోనూ తెలుగు వారు ఏకంగా 56 శాతం మంది ఉన్నారని తేలింది. దీంతో వీరందరికీ ఇప్పుడు ట్రంప్ సినిమా చూపించేస్తున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని అమెరికా అధికారులు జరుపుతున్న తనిఖీలు వీరికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.

క్యాంపస్ లో చదువుకుంటున్న వీరికి అదే క్యాంపస్ లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు వారానికి 20 గంటల పాటు చేసుకునే అవకాశం ఉంది. కానీ అందరికీ క్యాంపస్ లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు అంటే దొరకవు. కాబట్టి పెట్రోల్ బంకులు, మాల్స్ ఇలా బయట కూడా పనిచేసుకుంటున్నారు. ఇలా క్యాంపస్ లు కాకుండా బయట పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకునే వారికి అమెరికన్లకు చెల్లించే దాని కంటే తక్కువే చెల్లిస్తారు. కానీ ఇప్పుడు అక్కడే అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వారికి చిక్కితే వీసా రద్దు చేసి ఇంటికి పంపేస్తారు. తిరిగి అమెరికా మాటెత్తే పరిస్ధితి ఉండదు. దీంతో ముందే వారు పార్ట్ టైమ్ ఉద్యోగాలు మానేసి ఇంటికి డబ్బుల కోసం ఫోన్లు చేసుకోవాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తూ మన కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్ధితి.