అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడానికి భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికన్ ఉత్పత్తులపై అత్యధికంగా సుంకాలు వేసే దేశంగా భారత్ను అభివర్ణించే ట్రంప్.. మరోసారి ఇండియా అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భారత్లో అమెరికన్ వస్తువులేవీ విక్రయించడానికి వీలు లేనంత భారంగా సుంకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తడం, భారత్ చర్యలను బహిరంగ పరచడం వల్లే సుంకాలు తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని అన్నారు.

భారత్, చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ పేర్కొన్న విషయం అందరికే తెలిసిందే. భారత్ను అధిక సుంకాల దేశంగా అభివర్ణిస్తూ, తమ వస్తువులపై భారీగా టారిఫ్లు విధిస్తోందని అన్నారు. ఇప్పుడు అమెరికాకు సమయం వచ్చిందని.. ఆయా దేశాలు ఎంత సుంకాలు విధిస్తే తాము కూడా అంతే విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. ఏప్రిల్ 2 నుంచి భారత్, చైనా దేశాలపై అమెరికా సుంకాలు పెంచుతుందని, ఈ సుంకాలు అమెరికా దశను మార్చుతాయని చెప్పుకొచ్చారు.
అమెరికా ఆయుధాలే కొనండి
భారత్ రష్యా ఆయుధాలు కొనవద్దని, అమెరికా ఆయుధాలే కొనాలని యూఎస్ వాణిజ్యమంత్రి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. అలా అయితేనే భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. అమెరికా ఆయుధాలు కొనుగోలు చేస్తే అధునాతన రక్షణ వ్యవస్థలనూ అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. యూఎస్ డాలర్ను భర్తీ చేయడానికి కొత్త కరెన్సీ కోసం బ్రిక్స్ ప్రయత్నిస్తే అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని అన్నారు. తమతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికన్ దిగుమతులపై సుంకాలను తగ్గించాలని హోవార్డ లుట్నిక్ భారత్ను కోరారు.
భారత్ విదేశీ కార్లపై 110 శాతం దిగుమతి
భారత్కు టెస్లా కార్లను తీసుకురావాలని ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ విదేశీ కార్లపై 110 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోంది. ఈ అంశంపై ఎలన్ మస్క్ కూడా భారత్పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయినా భారత్ సుంకాలను తగ్గించడానికి ఒప్పుకోలేదు. సుంకాలను పూర్తిగా తొలగించే విషయంలో భారత్ సర్కారు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు, వాణిజ్య మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.