వాషింగ్టన్: భారత్, అమెరికాపై సుంకాల తగ్గింపునకు అంగీకరించిందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్ అత్యధికంగా సుంకాలు వసూలుచేస్తోందని.. ఆ దేశంలో ఏవీ విక్రయించడానికి వీలు లేనంత భారంగా అవి ఉన్నాయన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం..భారత్ చర్యలను తాము బహిరంగ పరచడం వల్ల సుంకాలను తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందని తెలిపారు. వైట్హౌస్లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మరోసారి సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా త్వరలో భారత్లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం భారత్ కార్ల దిగుమతిపై 110శాతం సుంకాలు విధిస్తోంది.

పలుమార్లు భారత్పై బహిరంగానే విమర్శలు
ఈ విషయంపై ఎలాన్ మస్క్ ఇప్పటికే పలుమార్లు భారత్పై బహిరంగానే విమర్శలు చేశాడు. ప్రపంచంలోనే కార్లపై అత్యధిక సుంకాలు విధించే దేశంగా అభివర్ణించాడు. తన సంస్థను సుంకాలు లేకుండా భారత్లో ప్రవేశపెట్టడానికి మస్క్ అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలోనే అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే భారత్ మాత్రం తక్షణమే సుంకాలను పూర్తిగా తొలగించే విషయంలో ఆచితూచి స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అప్పుడే భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం
భారత్ ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడడాన్ని మానుకోవాలని యూఎస్ వాణిజ్యమంత్రి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. అప్పుడే భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా అధునాతన అమెరికన్ రక్షణ వ్యవస్థలను అందించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని అన్నారు. యూఎస్ డాలర్ను భర్తీ చేయడానికి కొత్త కరెన్సీ కోసం బ్రిక్స్ యత్నిస్తే ఇరుదేశాల సంబంధాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు న్యాయంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే తమతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికన్ దిగుమతులపై సుంకాలను తగ్గించాలని న్యూఢిల్లీని కోరారు.