ఎల్ 2 ఎంపురాన్ సినిమా పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.అలాగే నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి మల్లికా సుకుమారన్ సైతం ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. ఎల్ 2 ఎంపురాన్ వివాదంపై ఇప్పటికే నటుడు మోహన్ లాల్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తరపున క్షమాపణలు తెలియజేస్తూ ఆయన ఒక పోస్టు కూడా పెట్టారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వివిధ విభాగాల నుంచి విమర్శలు వస్తుండగా, తాజాగా ఈ వివాదం పన్నుల విభాగానికి చేరింది. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.మూడు చిత్రాలలో నటుడి పారితోషికం గురించి సమాచారం కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. కడువ, జనగణమన, గోల్డ్ చిత్రాల పారితోషికానికి సంబంధించిన సమాచారం అందించాలని ఆ నోటీసులు పేర్కొంది. ఈ చిత్రాలకు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. అయితే సహ నిర్మాతగా దాదాపు 40 కోట్లు సంపాదించాడని సమాచారం.ఈ డబ్బుపై ఆదాయపు పన్ను శాఖ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇది సహజమైన ప్రక్రియ అని ఆదాయపు పన్ను శాఖ వివరించింది. గత నెల 29న పృథ్వీరాజ్ కు ఇమెయిల్ ద్వారా నోటీసు అందింది. ఈ నెల 29వ తేదీలోపు నోటీసుకు వివరణ ఇవ్వాలని వారికి తెలిపింది. ఇదిలా ఉండగా, ప్రముఖ పారిశ్రామికవేత్త గోకులం గోపాలన్ చెన్నై కార్యాలయం, నీలంకర నివాసంపై ఈడీ నిన్న దాడులు నిర్వహించింది.
తనిఖీలు
కేరళ, తమిళనాడులోని ఐదు ప్రదేశాలలో ఈ తనిఖీలు జరిగాయి. 14 గంటలపాటు ఈ తనిఖీలు జరిగాయని అర్ధరాత్రి తనిఖీలు పూర్తైనట్లు తెలుస్తోంది. నిన్న కోజికోడ్లో ఉన్న గోపాలన్ను సాయంత్రం చెన్నైకి పిలిపించి, అర్థరాత్రి వరకు ప్రశ్నించారు. విచారణ అనంతరం పత్రాలు, రూ.1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను వివరంగా పరిశీలించి, మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంపురాన్ వివాదం
మోహన్లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మార్చి 27న విడుదలైంది. అయితే ఈ మూవీలో 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న గోద్రా అల్లర్లు సంబంధించి సన్నివేశాలు ఉన్నాయి. ఈ మూవీలో బాల్రాజ్ భజరంగీ అనే వ్యక్తి ముస్లింలను కిరాతకంగా చంపడం చూపించారు. దీంతో ఈ చిత్రం హిందూ వ్యతిరేక అజెండాను ప్రోత్సహిస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపించారు.మరోవైపు కేంద్రం కావాలనే టార్గెట్ చేసి ఎంపురాన్ చిత్రబృందంపై దాడులు చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.