జైలులో పోసానికి అస్వస్థత అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో రిమాండ్లో ఉన్న పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న జైలు అధికారులు ఆయనను వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

14 రోజుల రిమాండ్
పోసాని కృష్ణమురళిపై ఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో కోర్టు నిన్న ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం కోర్టు విచారణ జరపనుంది. పోసాని కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 14కి పైగా కేసులు
ఇదిలా ఉంటే, పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా 14కి పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఒక కేసులో ఆయనకు బెయిల్ మంజూరైతే, మరో కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే పోలీసులు అన్ని చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు మాత్రం విచారణను న్యాయపరం
పోసాని కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది. ఆయనపై కేసులు నమోదు కావడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు మాత్రం విచారణను న్యాయపరంగా, చట్టపరంగా ముందుకు తీసుకెళ్తామని చెబుతున్నారు. మొత్తానికి పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, న్యాయపరమైన సమస్యలు ఆయనకు తలనొప్పిగా మారాయి. ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అందరి దృష్టి నిలిచింది. మరోవైపు, పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతుండటంతో, ఈ వ్యవహారం మరింత కీలక మలుపు తిరిగే అవకాశముంది.