Rajagopal Reddy : తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నా. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా నిర్వహించా. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా, ప్రజల పక్షాన నిలబడతా అన్నారు.

మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు
నిన్న ఢిల్లీలో సీరియస్గానే కేబినెట్ విస్తరణపై చర్చ జరిగినట్లు ఉంది. అయితే నాకు ఇప్పటివరకు ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదు..అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం అమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజా మంత్రి వర్గ విస్తరణలో కనీసం నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం.
క్యాబినేట్ విస్తరణతో పాటు ఇతర పదవులు నామినేటెడ్ పోస్టులు
కాగా, తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారు అయింది. ఉగాది నాటికి విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ఏడాదిన్నరగా విస్తరణకు సంబంధించి అనేక ఊహగానాలు వినిపించినప్పటికీ తాజాగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. క్యాబినేట్ విస్తరణతో పాటు ఇతర పదవులు నామినేటెడ్ పోస్టుల నిర్ణయం తీసుకోనున్నారు. నిన్న (సోమవారం) ముఖ్యమంత్రి ఢిల్లీలో పార్టీ ఆగ్రనేతలతో భేటీ అయ్యారు. సీఎంతో పాటు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.