విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలకృష్ణ ను ఎప్పుడు “సర్” అనే పిలవాలనిపిస్తుంది
పవన్ మాట్లాడుతూ..బాలకృష్ణను ప్రేమగా “బాలయ్య” అని పిలవమంటారని, కానీ తనకు ఆయనపై అపార గౌరవం ఉన్నందున “సర్” అని పిలవాలనిపిస్తుందని చెప్పారు. బాలకృష్ణ వ్యక్తిత్వం, అతని మనోబలం, సినీ ప్రస్థానం, సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం సంతోషం
ఇటీవల కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించినందుకు గర్వంగా ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ సినీ పరిశ్రమలోనే కాకుండా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అమూల్యమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలి
ఈ సందర్భంగా పవన్ ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కూడా మాట్లాడారు. 28 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో ముందుండి నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తలసేమియా బాధితులకు సహాయం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయుక్తమని అభిప్రాయపడ్డారు.
మ్యూజికల్ నైట్లో తమన్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత ప్రదర్శనను ప్రజలు ఆస్వాదించారు. నందమూరి, నారా కుటుంబ సభ్యుల సమక్షంలో పవన్, బాలకృష్ణ మధ్య జరిగిన మాటలకి అభిమానులు ఉత్సాహంగా స్పందించారు.