హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఇది పక్కా క్రైమ్ థ్రిల్లర్ సినిమా కథలా ఉందని చెప్పాల్సిందే. అయితే ఇది ఆర్టిఫిషియల్ కథ కాదు — నిజజీవిత ఘటన. ఓ మహిళ తన చెల్లెలి సహకారంతో భర్తను హత్య చేసి అనంతరం చుట్టుపక్కల వారిని నమ్మించేందుకు కట్టుకథలు అల్లింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధాల సంక్షోభం నుంచి… ఘోర హత్య వరకు
కేపీహెచ్బీ ప్రాంతానికి చెందిన సాయిలు అనే వ్యక్తి, కవిత అనే మహిళ దంపతులుగా కొన్నేళ్లుగా జీవిస్తున్నారు. అయితే వీరి మధ్య తలెత్తిన మనస్పర్థలు, అనుమానాలు, ఆరోగ్య సమస్యలు వారి వైవాహిక జీవితాన్ని మెల్లగా పాడు చేశాయి. భర్త సాయిలుకు, భార్య కవితకు కూడా వివాహేతర సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే సాయిలు తరచూ కవిత నివసిస్తున్న ఇంటికి వచ్చి గొడవలు, వేధింపులకు పాల్పడేవాడు. దీంతో విసుగుపోయిన కవిత అతన్ని శాశ్వతంగా వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.
చెల్లెలు, బావ కలిసి నేరానికి పాల్పడ్డ దారుణం
ఈ కిరాతక హత్యకు కవిత తన చెల్లెలు, ఆమె భర్త సాయంతో ప్రణాళిక సిద్ధం చేసింది. ముగ్గురు కలిసి సాయిలును ముందుగా మత్తు మందుల ద్వారా బలహీనపరచి, అనంతరం కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేశారు. ఈ నేరాన్ని బయటపడకుండా చేయడానికీ వారు ముందస్తుగా ప్లాన్ చేశారు. మృతదేహాన్ని రహస్యంగా పూడ్చిపెట్టి, అనంతరం కవిత తన సొంతూరుకు వెళ్లిపోయింది. సాయిలు గురించి కుటుంబ సభ్యులు అడిగినపుడు — అతను పని మీద వెళ్లాడని, తిరిగి రాలేదని కవిత చెప్పింది. అయినా ఆమె మాట్లాడే తీరుతో బంధువులు అనుమానించారు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో ఆగమాగమైన సమాధానాలు ఇచ్చిన కవిత చివరికి ఒత్తిడిలో నేరాన్ని అంగీకరించింది. పోలీసుల కథనం ప్రకారం, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మృతదేహాన్ని వెలికితీయగా, మృతునిపై హింసకు సంబంధించిన ఆధారాలు లభించాయి.
కేసు నమోదు, అరెస్టు
ప్రస్తుతం కవితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నేరంలో పాల్గొన్న ఆమె చెల్లెలు, బావపై కూడా కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Read also: Free cancer screening: తెలంగాణలో ఉచిత క్యాన్సర్ పరీక్షలకు ఏర్పాటు