గణేశ్ నిమజ్జనానికి ముందుగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)శుక్రవారం నాడు హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితర నేతలు ఉన్నారు.
71 ఏళ్ల ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు సీఎం ప్రశంస
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఖైరతాబాద్ (Khairatabad)గణేశ్ ఉత్సవాలు 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురాగలిగిన ఉత్సవ కమిటీని ఆయన అభినందించారు.

అన్ని శాఖల సమన్వయంతో మత సామరస్యానికి పునాది
హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో గణేశ్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుగుతున్నాయని వివరించారు. రేపు జరగనున్న నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో జరపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నిమజ్జన ఏర్పాట్లు పూర్తి: ట్యాంక్ బండ్ హైలైట్
ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ సహా ఇతర ప్రదేశాల్లో నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఎం వెల్లడించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
ఆగస్టు 27న ప్రారంభమైన ఉత్సవాలు
ఈ ఏడాది ఉత్సవాలు ఆగస్టు 27న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజతో ప్రారంభమయ్యాయి. ఈసారి ‘విశ్వశాంతి మహాశక్తి గణపతి’ పేరుతో 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో రూపొందించిన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మట్టి, స్టీల్, వరిపొట్టుతో తయారు చేసిన ఈ భారీ గణేశ్ విగ్రహం దర్శనార్థం లక్షలాది భక్తులు తరలివచ్చారు. గురువారంతో స్వామి దర్శనం ముగియగా, ప్రస్తుతం నిమజ్జనానికి అధికారులు, కమిటీ సన్నద్ధమవుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: