గ్రేటర్ హైదరాబాద్లో బస్సు ప్రయాణాలు చేసేవారికి శుభవార్త. నిమిషాలకొద్దీ బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. బస్సు మిస్ అవుతుందన్న టెన్షన్ కూడా లేకుండా ఇంట్లో ఉండే ప్రశాతంగా మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ బస్సు బస్టాండ్కు ఎంతసేపట్లో వస్తుందో తెలుసుకొని తీరిగ్గా.. అక్కడకు చేరుకోవచ్చు. అందుకోసం జీహెచ్ఎంసీ బస్ ఇన్ఫర్మేషన్ సిస్టం పేరుతో సరికొత్త యాప్ రూపొందిస్తుంది. ఒకవేళ మీ చేతిలో స్మార్ట్ఫోన్ లేకపోయినా..ఫర్వాలేదు. బస్టాపుల్లో నిల్చుని పైకి చూస్తే చాలు ఏ బస్సు ఎప్పుడు వస్తుందో నిమిషాలతోసహా.. క్లియర్ గా అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీని స్మార్ట్ సిటీ గా మార్చే కీలక చర్యల్లో భాగంగా ఈ సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు.

బస్సులను ట్రాక్ చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 2,800 బస్సుల్లో జీపీఎస్ సిస్టం అమర్చనున్నారు. తర్వాత బస్టాప్లలో ఉండే స్క్రీన్లు, ప్రత్యేక యాప్కు కనెక్ట్ చేస్తారు. స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ తెలియని వారి కోసం నగరవ్యాప్తంగా 1,250 బస్టాపుల్లో ప్రత్యేకంగా డిస్ప్లే స్క్రీన్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్క్రీన్ ప్లే పై ఆయా రూట్లలోని బస్సు నంబర్లతో పాటు ఏ ప్రాంతం నుంచి వస్తోంది.. అది ఏ ఏరియాకు వెళ్తుందనే సమాచారం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం బస్సు ఏ ఏరియాలో ఉంది? ఎంత సేపట్లో బస్టాప్కు వస్తుందో కూడా డిస్ప్లే అవుతుంది. దీంతో పాటుగా యాప్లో బస్సుల లైవ్ లోకేషన్ను ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకోసం జీహెచ్ఎంసీ ఆర్టీసీతో కలిసి పని చేస్తోంది. నెలరోజుల్లో ఈ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు టెండర్లు పూర్తి చేసి, తర్వాత మరో నెలలో సాప్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ కొత్త పద్ధతి ద్వారా భారం పడకుండా PPP మోడ్లో ఆపరేట్ చేసేందుకు జీహెచ్ఎంసీ అడ్వర్టైజ్మెంట్ విభాగం అధికారులు కసరత్తు చేస్తోంది. డిస్ప్లేల బాధ్యతలను టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు తెలిపారు.