ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్రలు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రల ద్వారా విద్యార్థులకు రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని శాస్త్రీయ, సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ విద్యా పర్యటనల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, మానసిక వికాసాన్ని ప్రోత్సహించడం, శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ రంగాలపై అవగాహన కల్పించడంలో ఈ యాత్రలు కీలక పాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా 7,784 మంది విద్యార్థులు
ఈ విజ్ఞాన విహార యాత్రలు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ప్రదేశాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నాయి. సంప్రదాయ కళా కేంద్రాలు, పురావస్తు ప్రదేశాలు, పరిశోధనా సంస్థలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక కేంద్రాలు వంటి వాటిని సందర్శించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కొత్త విషయాలపై అభిరుచిని పెంపొందించడంతో పాటు వారి అనుభవాలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 7,784 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. విద్యార్థుల భద్రత, మార్గదర్శకత్వం కోసం ఎస్కార్ట్ ఉపాధ్యాయులను కూడా నియమించనున్నారు.