రాజధాని హైదరాబాద్ నిన్న భారీ వర్షం(Rain)తో తడిసిముద్దయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొదలైన వర్షం సాయంత్రం 7 గంటల వరకు కుంభవృష్టిగా కురుస్తూ నగరంలో జనజీవనాన్ని స్థంభింపజేసింది. ముఖ్యంగా బోయిన్పల్లి, మారేడ్పల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 11.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ఉప్పల్లో 10.1 సెం.మీ., బండ్లగూడలో 9.9 సెం.మీ., ముషీరాబాద్లో 9 సెం.మీ. వర్షం కురిసింది.
రోడ్లు జలమయం – ట్రాఫిక్ పూర్తిగా అతలాకుతలం
ఈ కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో వాహనాలు ఇరుక్కుపోయాయి. పలుచోట్ల ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఐటి కారిడార్, ఖైరతాబాద్, అమీర్పేట్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు భయానకంగా కొనసాగాయి. సిటీబస్లు, క్యాబ్లు, ద్విచక్ర వాహనాలన్నీ రద్దీతో కదలలేని స్థితికి చేరాయి.
నగరవాసులకు నరకయాతన – అధికార యంత్రాంగం అలర్ట్
తీవ్ర వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోయి గుంతలు కనిపించకుండా పోవడంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు మొరాయించడంతో ప్రజలు చేతులారా వాహనాలను తోసుకుంటూ వెళ్తూ కనిపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. పునరావాసం అవసరమైన చోటులలో సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు వాతావరణ శాఖ మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశముందని హెచ్చరించింది.
Read Also : AP Liquor Case : ఛార్జ్ షీట్ దాఖలుకు సిట్ రెడీ!