నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో చేసిన హంగామా టీడీపీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. తన విపరీత చేష్టలతో కార్యాలయంలో గందరగోళం సృష్టించినట్లు ఆరోపణలు రావడంతో, పార్టీ హైకమాండ్ ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ కార్యాలయంలో లేని సమయంలో ఆయన ఛాంబర్లోకి వెళ్లి అడ్డగోలు ప్రవర్తన ప్రదర్శించడం, అధికారులను భయబ్రాంతులకు గురిచేయడం పార్టీలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
ఈ ఘటనకు కారణం నరసరావుపేట ఐఎంఎల్ డిపో
ఈ ఘటనకు కారణం నరసరావుపేట ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న 10 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించి, వారి స్థానంలో తన అనుచరులను నియమించాలని ఎమ్మెల్యే అరవిందబాబు చేసిన విజ్ఞప్తి. అయితే, కమిషనర్ నిశాంత్ కుమార్ దీనిపై పరిశీలన చేయాల్సి ఉంటుందని చెప్పినా, ఎమ్మెల్యే వినిపించుకోలేదు. రెండు గంటల తర్వాత మళ్లీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి, అధికారి లేని సమయంలో తీవ్రంగా ఆగ్రహంతో ప్రవర్తించారు. సోఫాలో కూర్చోవడం, నేలపై పడుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ వ్యవహారం టీడీపీ హైకమాండ్ దృష్టికి వెళ్లిన తర్వాత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అరవిందబాబుకు ఫోన్ చేశారు. అయితే, ఆయన స్పందించకపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. మంత్రులు, ఇతర టీడీపీ నేతలు కూడా ఫోన్ చేసినా, అరవిందబాబు ఎవరితోనూ మాట్లాడలేదు. చివరికి కమిషనర్ కార్యాలయానికి వచ్చి, నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని డిపో మేనేజర్ను ఆదేశించడంతో, ఎమ్మెల్యే సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే చేసిన వ్యవహారం పార్టీకి తీవ్ర ఇబ్బంది
అయితే, ఎమ్మెల్యే చేసిన వ్యవహారం పార్టీకి తీవ్ర ఇబ్బందిని కలిగించిందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. ఒక ప్రజాప్రతినిధిగా ఇలా వ్యవహరించడం అసమంజసమని, పార్టీకి ప్రతికూల ప్రభావం కలిగేలా ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని హెచ్చరించింది. అరవిందబాబు నుంచి పూర్తి వివరణ కోరిన హైకమాండ్, తదుపరి చర్యలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.