ఐపీఎల్లో ఐదు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు 2025 సీజన్ ఆశించినంతగా సాగడం లేదు. సారథి మారినా ఆ జట్టు రాత మారలేదు. రుతురాజ్ గాయపడటంతో దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా,చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్ వైఫల్యంతో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులకే పరిమితమైంది. అందరూ విఫలమైనా గుడ్డిలో మెల్లలా శివమ్ దూబె (29 బంతుల్లో 31 నాటౌట్, 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సునీల్ నరైన్ (3/13) బంతితో పాటు బ్యాట్ (18 బంతుల్లో 44, 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తోనూ రాణించి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనను కోల్కతా 10.1 ఓవర్లలోనే దంచేసింది. ఈ సీజన్లో కోల్కతాకు ఇది మూడో విజయం కాగా చెన్నైకి ఇది వరుసగా ఐదో ఓటమి.
బ్యాటింగ్ ఆర్డర్
ప్రత్యర్థి జట్లన్నీ పవర్ ప్లేలో వీరబాదుడు బాదుతూ వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడుతుంటే చెన్నై ఆటతీరు మాత్రం నానాటికీ తీసికట్టుగా మారుతుందనడానికి ఈ స్కోరే నిదర్శనం. ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్న రచిన్ (4) మళ్లీ నిరాశపరచగా కాన్వే (12), రుతురాజ్ స్థానంలో వచ్చిన త్రిపాఠి (16) అతడినే అనుసరించారు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన విజయ్ శంకర్ (29) నిలదొక్కుకున్నట్టే కనిపించినా స్పిన్నర్ల రాకతో అతడూ నిష్క్రమించాడు. కోల్కతా స్పిన్నర్ల ధాటికి చెన్నై మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. అశ్విన్ (1) సింగిల్ డిజిట్కే పరిమితమవగా జడేజా, దీపక్ హుడా డకౌట్ అయ్యారు. చెన్నై భారీ ఆశలు పెట్టుకున్న సారథి ధోనీ (1) కూడా ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. దూబె ఆఖరిదాకా క్రీజులో నిలిచినా అతడూ బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. ఐపీఎల్లో చెన్నైకి ఇది రెండో అత్యల్ప స్కోరు కాగా చెపాక్లో ఇదే మొదటిది. నరైన్తో పాటు కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (2/22), హర్షిత్ రాణా (2/16) పొదుపుగా బౌలింగ్ చేసి చెన్నైని కట్టడిచేశారు.

విశాల్ రియాక్ట్
ఈ ఓటమి అభిమానులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరుపై హీరో విష్ణు విశాల్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇండైరెక్ట్గా ధోనీపై విరుచుకుపడ్డాడు. ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లను చూసిన తరువాత క్రికెటర్ కావాలనుకునే తన ప్రయత్నాలను మానుకున్నానంటూ తేల్చి చెప్పాడు. ఇలా వరుసబెట్టి మ్యాచ్లను ఓడిపోవడం అత్యంత దారుణమంటూ వ్యాఖ్యానించాడు. లోయర్ ఆర్డర్లో ధోనీ బ్యాటింగ్కు రావడాన్నితప్పు పట్టాడు విష్ణు విశాల్. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం ఎందుకంటూ నిలదీశాడు.ఓడిపోడానికి ఎవ్వరైనా మ్యాచ్లు ఆడతారా అంటూ ఎద్దేవా చేశాడు. ఈ మ్యాచ్ ఓ సర్కస్ను చూసినట్టుగా ఉందని చురకలు అంటించాడు. స్పోర్ట్స్ కంటే ఎవ్వరూ గొప్పవాళ్లు కాదని చెప్పాడు.
Read Also: IPL 2025 :సీఎస్కే పై కోల్కతా భారీ విజయం