తమిళనాడులో ఈరోడ్ తూర్పు ఉప ఎన్నికల విషయంలో ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిఝగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటిస్తూ, అధికార దుర్వినియోగం జరుగుతోందని విమర్శించింది. డీఎంకే ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను పాటించకుండానే తమ అధికారాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆరోపించింది.
టీవీకే జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ మాట్లాడుతూ.. గతంలో విక్రవాండి ఉప ఎన్నికల్లో కూడా తమ పార్టీ ఇదే విధానాన్ని అనుసరించిందని చెప్పారు. అప్పటి నిర్ణయానికి కట్టుబడి, ప్రస్తుతం కూడా ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని తెలిపారు. ప్రజాస్వామ్య విధానాలను నాశనం చేసే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ పూర్తి దృష్టి 2026 అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని, ఉప ఎన్నికల్లో పాల్గొనడంపై ఆసక్తి చూపడం లేదని హీరో విజయ్ ప్రకటించారు. తాత్కాలిక ఎన్నికల విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉండాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని విజయ్ అభిప్రాయపడ్డారు.
ఈరోడ్ తూర్పు ఉప ఎన్నిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఎలంగోవన్ మరణంతో ఖాళీ అయ్యింది. డీఎంకే అభ్యర్థి వీసీ చంద్రకుమార్, ఎన్టీకే అభ్యర్థి ఎంకే సీతాలక్ష్మిల మధ్య ఈ సారి పోటీ నెలకొంది. ఇతర ప్రధాన పార్టీలు కూడా ఈ ఎన్నికలను బహిష్కరించడంతో పోటీ పరిమితమైంది. టీవీకే తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ పార్టీ 2026 ఎన్నికల విజయంపై దృష్టి పెట్టడం, ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలపై విముఖత వ్యక్తం చేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఈ నిర్ణయం విజయ్ పార్టీకి భవిష్యత్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.