ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు స్పందిస్తూ.. రుణభారం, బ్యాంకుల వేధింపులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్రావు అన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం లాభసాటిగా మారిందని, కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి మరింత దిగజారిందని విమర్శించారు. రుణమాఫీ మభ్యపెట్టి, హామీలను అమలు చేయకపోవడం వల్లే రైతులు ఈ స్థితిలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు 402 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం దుర్మార్గమని హరీశ్రావు అన్నారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండడం దారుణమని మండిపడ్డారు. రైతులు రుణమాఫీ కోసం కలెక్టరేట్లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమ జీవితాలను కష్టాల్లో నెట్టుకుంటున్నారని చెప్పారు. ఈ దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
ఈ సందర్బంగా రైతులెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదని హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని, రుణమాఫీ, బోనస్ వంటి వాగ్దానాలను మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు.