హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనమని అన్నారు. అబద్ధాల ప్రచారాన్ని నమ్మించడానికి గవర్నర్ ప్రసంగాన్ని వాడుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో దశ, దిశ లేదని అన్నారు. గత ఏడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏమీ లేదని పేర్కొన్నారు.

అబద్ధాలతో కూడిన ప్రసంగం
గవర్నర్లు మారారు తప్పితే, ప్రసంగాలు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు. చేయనివి చేసినట్లు, ఇవ్వనివి ఇచ్చినట్లు, అబద్ధాలతో కూడిన ప్రసంగాన్ని ప్రభుత్వం గవర్నర్తో చెప్పించిందని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నమయ్యారని విమర్శించారు. నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే” అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలతో గవర్నర్ 32 పేజీల ప్రసంగాన్ని మొదలు పెట్టారని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో జీవితాలు మారుతున్నాయి
ఈరోజు కూడా ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రజాపాలన పేరిట పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో జీవితాలు మారుతున్నాయని గవర్నర్ ప్రసంగంలో చెప్పారని, ఎవరి జీవితాలను మార్చారని ప్రశ్నించారు. లగచర్ల, న్యాలకల్, అశోక్ నగర్లో రైతులను, నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం, ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం… ఇదేనా మీరు చెప్పిన ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్ అని నిలదీశారు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కావాలని అన్నారు. అంతేగానీ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు, ఢిల్లీ అభివృద్ధి కాదని వ్యాఖ్యానించారు.