రేవంత్ రెడ్డి ఈ రైతుకు ఏం జవాబిస్తారు?
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందనేది కట్టుకథే అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఓ రైతు నిరసనకు దిగిన వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ‘అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి @revanth_anumula గారూ..మిమ్మల్ని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరికి ఏం సమాధానం చెబుతారు.
ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు చేరకముందే..
మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి బూటకమేనని తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నారు. మిమ్మల్ని నిలదీసేందుకు ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు చేరకముందే పాపపరిహారం చేసుకోండి. రైతులు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు..అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ఈరోజు గాంధీ భవన్ దాకా వచ్చిన వారు,రేపో మాపో మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాక వస్తరు.
హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలి
ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించు. ఏడు పదుల వయస్సులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిండు. అధికారులను వేడుకున్నడు. అయినా, వెనకడుగు వేయకుండా గాంధీ భవన్ దాకా వచ్చి పోరాటం చేస్తున్న రైతు యాదగిరి గారి పట్టుదలకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలని బీఆర్ఎస్ పక్షాన పిలుపునిస్తున్నాం అని హరీశ్ రావు రాసుకొచ్చారు.