హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చనుంది. ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో డేటా ఎంట్రీకి ప్రభుత్వం విధించిన డెడ్లైన్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గ్రామ సభల్లో, మండల కార్యాలయాల్లో జనవరిలో నాలుగు రోజులపాటు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి సైట్ క్లోజ్ చేస్తామని, మార్పులకు అవకాశం లేదని పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన డీఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేసింది.

దాదాపు 6 లక్షల మందిని లబ్ధిదారులను తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేసింది. కొత్తగా వచ్చిన 2,24,487 దరఖాస్తుల్లో 19,193 అప్లికేషన్లకు ఓకే చేశారు. ఓవరాల్గా పలు కారణాలతో 1,44,784 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మరో 59,542 దరఖాస్తులపై నిర్ణయం పెండింగ్లో ఉంది. వాటిలో మరో 5, 6 వేల వరకు అర్హులుగా మారతారని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ భరోసాకు 5,80,577 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 25 నుంచి 30 వేల మంది అర్హుల జాబితాలో చేరనున్నారు. ఉపాధి హామీ పథకం కింద 2023-24లో 20 రోజుల పని దినాలు పూర్తి చేసిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు.
కుటుంబ యజమాని పేరిట గానీ, ఇతర కుటుంబసభ్యులకు గానీ ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా వారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అన్హరులు అవుతారు. కొన్ని అప్లికేషన్లు రిజెక్టు కావడంపై తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం స్పష్టం చేసింది. కుటుంబ యాజమానికి, లేక కుటుంబంలో ఎవరికైనా 10 ఏళ్ల క్రితం భూమి అమ్ముకున్నా వారి పేర్లు రికార్డుల్లో ఉండటంతో వారిని సైతం ఈ పథకానికి ఎంపిక చేయలేదు. వీరిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. భూమి విక్రయించినా, రికార్డుల్లో వారి పేరు ఉన్న వారిని ప్రస్తుతానికి లబ్దిదారులుగా ప్రభుత్వం గుర్తించడం లేదు.