తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేస్తున్న చిరు ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఇప్పటివరకు వీరు జీతాల కోసం నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అయితే మే నెల నుంచి వారికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నెలనెలా జీతాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో పంచాయతీ ఉద్యోగుల్లో ఆనందావేశం నెలకొంది.
పంచాయతీరాజ్ శాఖ పంపిన ఫైలుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్
ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ పంపిన ఫైలుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఈ ఉద్యోగుల జీతాల కోసం రూ. 115 కోట్లు కేటాయించనుంది. ఇప్పటి వరకూ జీతాల కోసం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న చిరు ఉద్యోగులకు ఇది ఎంతో ఊరట కలిగించనుంది. ఇకపై జీతాల జాప్యం లేకుండా ప్రతి నెల కూడా వారి ఖాతాల్లో జీతం జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 92,000 పంచాయతీ ఉద్యోగులకు ప్రత్యక్షంగా లాభం
జీతాల పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా 92,000 పంచాయతీ ఉద్యోగులకు ప్రత్యక్షంగా లాభం చేకూర్చనుంది. గ్రామీణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ ఉద్యోగులకు ఈ మంత్లీ శాలరీ సిస్టం ప్రోత్సాహకంగా మారనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పంచాయతీ ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.