2025 ఫిబ్రవరి 1న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన తొలి పూర్తి బడ్జెట్ను పార్లమెంటులో సమర్పించారు. ఈ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా ఎనిమిదవ సాధారణ బడ్జెట్. ఈ బడ్జెట్లో సామాన్యుల నుండి వ్యాపారుల వరకు అందరికి అనేక ఆశలు ఉన్నాయి.రైతులకు ఈ బడ్జెట్లో మంచి వార్తలు ఉన్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దీనితో రైతులు తమ పెట్టుబడులు మరింత సులభంగా పెంచుకునే అవకాశాన్ని పొందారు.

అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తి కోసం స్వయం సమృద్ధి పథకం ప్రారంభించాలని చెప్పారు.కంది, మినుములు, మసూర్ పప్పులు కొనుగోలు చేయనున్నామని కూడా వెల్లడించారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభించనున్నట్లు కూడా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకంతో రైతులకు మంచి లాభాలు చేకూరనున్నాయి. ఈ బడ్జెట్లో మన దేశం ఆర్థిక వృద్ధి పరంగా మరింత ముందుకు సాగిపోతున్నట్లు పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి అత్యధిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. వ్యవసాయం, MSME (చిన్న, మధ్యతరహా పరిశ్రమలు), ఎగుమతులు, పెట్టుబడులు వంటి ఆరు ప్రధాన రంగాలలో మార్పులు తీసుకురావాలని ఆర్థిక మంత్రి చెప్పారు.
ఈ బడ్జెట్లో మరో కీలక అంశం పీఎం ధన్ధాన్య కృషి యోజన ప్రారంభం. ఈ పథకాన్ని మొదట 100 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా 17 కోట్ల మంది రైతులకు లాభం చేకూరిపోతుందని, వారికి ఆర్థిక సాయం అందిస్తుందని మంత్రిగారు వివరించారు. వలసలు అరికట్టడంపై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, ఇది ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తామని పేర్కొన్నారు.ఈ బడ్జెట్లో పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక కూడా రూపొందించబడింది. ఈ ప్రణాళిక ద్వారా పప్పు ఉత్పత్తిని పెంచడం, రైతులకు మరింత ఆదాయం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.మొత్తంగా, ఈ బడ్జెట్ దేశంలోని ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి, చిన్న పరిశ్రమలకు మంచి అంచనాలను కల్పించేలా ఉందని అనిపిస్తుంది.