అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవల చుక్కలను తాకాయి. సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3168 డాలర్ల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే ఒక్కరోజులోనే సీన్ పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగానూ ధరలు భారీగా పడిపోయాయి.
ఒక్కరోజులోనే 100 డాలర్లకు పైగా గోల్డ్ ధర పతనం
ఇటీవలి ట్రేడింగ్ సెషన్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3080 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో ఇది 3060 డాలర్ల స్థాయిని కూడా తాకింది. అంటే, ఒకే రోజులోనే 100 డాలర్లకు పైగా తగ్గిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ఇలా ఒక్కరోజులో భారీగా పతనం జరగలేదు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ప్రాఫిట్ బుకింగ్ అని నిపుణులు చెబుతున్నారు. ధరలు గరిష్టానికి చేరడంతో, ఇన్వెస్టర్లు తమ లాభాలను నిలబెట్టుకోవడానికే భారీగా అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డాలర్ విలువ బలపడటంతో గోల్డ్ మరింత పడిపోయింది.

దేశీయంగా కూడా భారీగా తగ్గిన ధరలు
దేశీయంగా కూడా బంగారం ధరలు బాగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1600 తగ్గి తులం రూ. 84,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1740 తగ్గి 10 గ్రాములు రూ. 91,640గా ఉంది. వెండి ధరలు కూడా ఒక్కరోజులోనే రూ. 4,000 తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది వినియోగదారులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలుదారులకు శుభవార్తగానే చెప్పవచ్చు.
NFP డేటా & ఫెడ్ చైర్మన్ ప్రసంగం కీలకం
ఇప్పుడంతా మళ్లీ అమెరికాలో విడుదల కానున్న నాన్ఫామ్ పేరోల్స్ (NFP) డేటాపై ఫోకస్ ఉంది. ఈ డేటా ఆధారంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగాల సంఖ్య అంచనాలకు పైగా ఉంటే డాలర్ బలపడుతుంది, ఇది గోల్డ్ ధరలను మరింతగా తగ్గించవచ్చు. అదే ఉద్యోగ వృద్ధి అంచనాలకు తగ్గదంటే డాలర్ బలహీనపడి బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది. ఇదే సమయంలో ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం కూడా మార్కెట్లపై, ముఖ్యంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.