గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన పార్టీ మార్పు గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను అని స్పష్టం చేశారు. కొందరు తనను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితాన్ని అప్రతిష్ఠపాలు చేసే ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.

దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు
ఈ తప్పుడు ప్రచారంపై గద్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి బీఆర్ఎస్ క్యాడర్ను గందరగోళానికి గురిచేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి నిజం లేని ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
గతంలో కాంగ్రెస్ లో చేరి తిరిగి బీఆర్ఎస్ లోకి
కృష్ణమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అనంతరం తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అప్రచారాలను సహించేది లేదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తానని హెచ్చరించారు.