భారత్ పొరుగు దేశాలు అయిన చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) విస్తరణపై కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు బీజింగ్లో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, అఫ్గానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ పాల్గొన్నారు. ఈ మేరకు ఇస్లామాబాద్లోని పాక్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, అఫ్గానిస్థాన్ (Afghanistan) తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ బీజింగ్లో అనధికారిక త్రైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ను అఫ్గానిస్థాన్ వరకు విస్తరించాలని నిర్ణయించారు. అలాగే మూడు దేశాల అగ్ర నాయకులు త్రైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి అంగీకరించారు.
ఆర్థిక, వాణిజ్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి
పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన తర్వాత పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తొలి చైనా పర్యటన ఇదే కావడం గమనార్హం. మూడు రోజల పర్యటన నిమిత్తం ఆయన చైనా వెళ్లారు. ఈ క్రమంలో బీజింగ్లో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ‘పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్ (Afghanistan) ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం కలిసి నడుస్తాయి.’ అని దార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ముగ్గురు నాయకులు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

భారతదేశపు అభ్యంతరాలు
ముగ్గురు విదేశాంగ మంత్రులు ప్రాంతీయ భద్రత, ఆర్థిక అనుసంధానాన్ని ప్రోత్సహించడానికి త్రైపాక్షిక సమావేశాన్ని కీలకమైన వేదికగా అభివర్ణించారు. ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో మరో సమావేశాన్ని కాబుల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. “దౌత్య సంబంధాలు కొనసాగించడం, కమ్యూనికేషన్లను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటివే కీలకమైనవి. వీటి గురించే చర్చించాం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సహకారాన్ని మరింతగా పెంచడానికి చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ని అఫ్గానిస్థాన్ వరకు విస్తరించడానికి అంగీకరించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ఈ ప్రాంతంలో స్థిరత్వం, అభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడిగా కృషి చేస్తాం. ” అని ముగ్గురు నాయకులు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, 60 బిలియన్ డాలర్లతో చేపట్టిన సిపెక్ను భారత్ తీవ్రంగా వ్యతిరేస్తూ వస్తోంది. ఈ ప్రాజెక్టులో పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం కూడా ఉండటం అందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.తదుపరి సమావేశం: మూడు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య తదుపరి సమావేశం అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్లో నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ త్రైపాక్షిక సహకారం ద్వారా ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్నారు.
Read Also: Centre On Waqf Act: సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్ట సవరణలపై విచారణ